KTR on Medigadda : నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఈ కొటేషన్ గుర్తుందిగా.. వాహనదారులను అలర్ట్ చేయడానికి రవాణాశాఖ అధికారులు ఇచ్చే సూచన. కానీ ప్రస్తుతం దీనిని మేడిగడ్డకు కూడా వాడుకోవచ్చు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అయినప్పటికీ తాము ఏం తప్పు చేయనట్లు, అది ఏదో చిన్న పొరపాటులాగే మాట్లాడుతున్నారు గత ప్రభుత్వ నేతలు.
నిలువెల్లా నిర్లక్ష్యం, మాటల్లోనూ సమర్థత, ప్రభుత్వంలో ఉన్నప్పుడూ అదే తీరు, అధికారం దిగినా అదే పద్ధతి. అసలు ఏం జరగలేదన్నట్లు బుకాయింపు. కనీసం కొద్దిగైనా లేని పశ్చాత్తాపం.. ఇదీ బీఆర్ఎస్ నేతల తీరు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గతంలో మంత్రిగా ఉన్నప్పుడూ మేడిగడ్డపై తేలికగా మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుతం కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. అది చిన్న పొరపాటు లాగే కొట్టిపారేస్తున్నారు. తాజాగా స్వేదపత్రం విడుదల చేసే సందర్భంగా మేడిగడ్డపై మరోసారి మాట్లాడారు కేటీఆర్.
ఇదీ కేటీఆర్ తీరు. కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టుపై బట్ట కాల్చి మీద వేస్తున్నారని అంటున్నారు. ఒక్క బ్యారేజీలో లోపం ఉంటే ప్రాజెక్ట్ మొత్తం లోపభూయిష్టమేనా అని కేటీఆర్ ప్రశ్న. నిజంగానే అంత చిన్న పొరపాటు మాదిరిగా కేటీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అంటున్నారు నిపుణులు. జనాలకు ఏం తెలీదనే ఉద్దేశంతోనే కేటీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మేడిగడ్డ కాళేశ్వరానికి గుండెకాయ లాంటిది. ఒక్క మేడిగడ్డ కుంగడంతోనే అన్నారం, సుందిళ్లపై కూడా ప్రభావం పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ ఫస్ట్ పాయింట్ అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇది స్ట్రాంగ్గా ఉంటేనే అన్నారం, సుందిళ్లకు కూడా ఎలాంటి నష్టం ఉండదు. అలాంటి బ్యారేజ్ కుంగడంతో… ఇప్పుడు మూడింటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మూడు బ్యారేజ్ల్లోనూ నీటిని నిల్వ ఉంచే అవకాశం లేదు. అందుకే ఈ 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందేని నీటి పారుదలశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అనుమతించాలంటూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మేడిగడ్డ కుంగుబాటుపై అధ్యయనానికి ఖాళీ చేయటం తప్పనిసరిగా పేర్కొన్న నీటిపారుదల శాఖ అన్నారం, సుందిళ్లలోనూ జలాల తరలింపునకు అనుమతివ్వాలని కోరింది.
అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కొంతమేర కుంగినపుడు నీటి నిల్వలను చాలావరకు దిగువకు వదిలేశారు. అన్నారం, సుందిళ్లలోనూ కొంతమేరకు దిగువకు విడుదల చేశారు. నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అన్నారం, సుందిళ్లలోనూ మేడిగడ్డ లాంటి సమస్యలు రావచ్చని, వాటిల్లోనూ నీటిని ఖాళీ చేయాలని పేర్కొన్నారు. అన్నారం బ్యారేజీని సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం కూడా నవంబరు 14న తమ పరిశీలనలో తేలిన అంశాలను పేర్కొంటూ నీటిని ఖాళీ చేయించాలని సూచించింది.
మేడిగడ్డ పూర్తయ్యే వరకు అన్నారం, సుందిళ్లలోనూ నీటిని స్టోరేజ్ చేసే అవకాశం లేదు. ఈ బ్యారేజ్ను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుందో క్లారిటీ లేదు. ఖర్చు కూడా ఎవరు భరిస్తారనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ భారం ప్రజలపైనే పడనుంది. గత సర్కార్ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలను ముంచేలా చేసింది. అయినప్పటికీ తాము ఏం తప్పు చేయలేదన్నట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.
.
.