Ayodhya Ram Mandir: దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న రామభక్తుల కల నిజం కాబోతోంది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు 84 సెక్షన్ల అమృత ఘడియలు.. అద్భుత ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ వెల్లడించారు. ఆ సమయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగితే దేశం మారు మోగిపోతుందన్న ఆయన.. మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు.
యూపీలోని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. భవ్య మందిర నిర్మాణం పూర్తి కానుండటంతో వచ్చే నెల 22 వ తేదీన.. అయోధ్య రామాలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయితే ఆరోజు మంచి ముహూర్తం ఉందని.. మధ్యాహ్న సమయంలో 84 సెకన్ల పాటు శుభ గడియలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుందని అయోధ్య ట్రస్ట్ వెల్లడించింది.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక అత్యంత అట్టహాసంగా కన్నులపండుగగా జరగనుంది. అందుకోసం ఏర్పాట్లలో మునిగింది అయోధ్య రామ మందిర ట్రస్ట్. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఎలాంటి విపత్తులు వచ్చినా ఆలయం చెక్కు చెదరకుండా.. 2 వేల 500ల ఏళ్లపాటు ఎంతటి ప్రకృతి ప్రళయమైనా తట్టుకుని నిలబడేలా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు ఆర్కిటెక్ట్ అశీశ్ సోంపురా. ఆలయాన్ని దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారని.. ముఖ్యమైన ఆలయ గర్భ గుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుందన్నారు. అలాగే ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్లో 35-40 వేల మంది భక్తులు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.