Godavari : అనుమానంతో భార్యను హత మార్చాడో భర్త. ఈ దారుణం గోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరంకి చెందిన తాతపూడి సూర్యనారాయణ అనే వ్యక్తికి ఎన్టీఆర్ కాలనీకి చెందిన రామలక్ష్మి అనే యువతితో 2017 మే 24 న వివహం జరిగింది. ఆ దంపతులకు నాలుగేళ్ల హేమాన్ష్ అనే బాబు ఉన్నాడు.
చక్కని కాపురంలో అనుమానం అనే భూతం వచ్చి వారి మధ్య చిచ్చు పెట్టింది. ఏడాది నుంచి అనుమానంతో సూర్యనారాయణ భార్య రామలక్ష్మిని వేధిస్తుండటంతో.. తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళింది. తన తల్లిదండ్రులు సర్ది చెప్పి రామలక్ష్మిని తిరిగి మళ్లీ కాపురానికి పంపిచేవారు. అయినా భర్త ప్రవర్తన మారకపోవడంతో రామలక్ష్మి పోలీసు స్టేషన్ లో భర్తపై కేసు నమోదు చేసి పుట్టింటికి వచ్చింది.
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. సూర్యనారాయణ రామలక్ష్మిపై దాడి చేసి 12 సార్లు కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన రామలక్ష్మి తండ్రి పై కూడా సూర్యనారాయణ దాడి చేసి కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు 108కి ఫోన్ చేసి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 12 కత్తి పోట్లు దిగడంతో రామలక్ష్మి మరణించింది. చికిత్స పోందుతూ సూర్యనారాయణ కూడా మరణించాడు. భార్యపై అనుమానంతో చక్కని కుటుంబాన్ని చేతులారా నాశనం చేసుకుని నాలుగేళ్ల బాబుని అనాథను చేశారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.