Janasena: సీఎం జగన్ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా వైసీపీని ఢీకొట్టేందుకు ఎత్తుగడలను రచిస్తోంది. ఈ మేరకు ఏపీలో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్కల్యాణ్. జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో గత మూడు రోజులుగా కీలక చర్యలు కొనసాగుతున్నాయి. పీఏసీ సభ్యులు, ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. నేతల బలాబలాలపై నాదెండ్ల మనోహర్తో చర్చిస్తున్నారు.
ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా, గుంటూరు, తిరుపతి, అనంతపురం ప్రకాశం జిల్లా నేతలతో చర్యలు జరిపిన పవన్కల్యాణ్… దాదాపు 16 స్థానాల్లో అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాను రేపు టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపే అవకాశం ఉంది. అలాగే సీట్ల సర్దుబాటుపై రెండు మూడు రోజుల్లో టీడీపీతో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెడీ అయిన అభ్యర్థులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న సేనాని పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీస్ ప్రారంభించి ఎన్నికల పనులకు శ్రీకారం చుట్టాలని చెప్పడంతో.. జనసైనికులు నేడు పలు చోట్ల జనసేన కార్యాలయాలను ప్రారంభించనున్నారు .