Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో హృదయ విదారకమైన ఘటన జరిగింది. ఎలుక కొరకడంతో కేవలం 40 రోజుల వయసున్న శిశువు మృతి చెందింది. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
మూడేళ్ల క్రితం పెద్దకొత్తపల్లి మండలం పెద్దకారుపాములవాసి శివతో నాగనూలుకు చెందిన లక్ష్మీకళకు వివాహమైంది. నిండు గర్భిణీ అయిన లక్ష్మీకళ ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. 40 రోజుల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో వారి ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువ లేదు.
చిన్న బాబు ఇంట్లో పడుకుని ఉండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో మాయదారి ఎలుక.. ఆ చిన్నారి ముక్కు కొరికేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐతే పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు అక్కడి వైద్యులు. కానీ హైదరాబాద్ వచ్చినా.. శిశువు ప్రాణాలు దక్కకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం పసికందు డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.