CM Revanth Reddy: పాలనలో తన మార్క్ను చూపిస్తూ ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా.. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వాటిపై దృష్టిసారించారు. ఎవరైనా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత..తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చక్కదిద్దుకుని నెమ్మదిగా ప్రజా సమస్యలపై దృష్టి పెడుతారు. కానీ రేవంత్ మాత్రం అందరిలా కాకుండా పరిపాలలో ఓ కొత్త ఒరవడిశ్రీకారం చుట్టారు. వస్తూరాగానే ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టారు. అందుకు ప్రగతిభవన్ ను ప్రజా భవన్ గా మార్చి.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణిని నిర్వహించయమే అందుకు నిదర్శనం. పరిపానలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు.. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇందుకోసం ప్రజాపాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశమయ్యారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహిస్తున్నట్టు సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈసమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కొత్త రేషన్కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు ఒకసారి మాత్రమే నూతన రేషన్కార్డులను పంపిణీ చేశారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రక్రియ గత ప్రభుత్వం చేపట్టలేదు. కేవలం కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆదిశగాకూడా ఎలాంటి ప్రక్రియకు ముందడుగు పడలేదు. నూతన రేషన్కార్డుల అప్లికేషన్లను మీసేవా ద్వారా ఆన్లైన్లో తీసుకుంటారు. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేశాక ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామసభలు.. నగరాలు, పట్టణాల్లో బస్తీసభల ద్వారా జరుగుతుంది. ఈ ప్రాసెస్ చూడటం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను ప్రభుత్వం నియమించనుంది.