Hyderabad : ఓ పేద కుటుంబం 20 రోజులుగా కొడుకు ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ కు తిరగని రోజు లేదు. చివరకు ఆసుపత్రిలో 20 రోజుల క్రితమే మృతి చెందిన విషయం తెలుసుకొని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 రోజులుగా తమ కొడుకు అనాధ శవంగా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో ఉన్నాడంటు కన్నీటి పర్యంతమయ్యారు.
చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని కారు ఢీకొట్టంది. రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఉద్యోగి శ్రవణ్ కుమార్ (23) అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చాదర్ఘాట్ పోలీసులు తీవ్ర గాయాలపాలైన యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు.
కొడుకు ఆచూకీ కోసం ఈ నెల 11 న చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రమాదం గురించి మృతుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రమాదం గురించి తెలిసినా పోలీసులు బయటకు చెప్పక పోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.
చివరకు శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి మార్చురీలో అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. స్పందించిన పోలీసులు.. శ్రవణ్ మృతి చెందాడని నిర్లక్ష్యంగా బాధితులకు సమాధానం అందించారు.
రోడ్డు ప్రమాదం గురించి పోలీసులు దాచి పెట్టడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం మృతదేహంతో చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ప్రమాదం జరిగి 20 రోజుల జరిగినా.. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనిపించకుండా పోయిన కొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయాన్ని పోలీసులు చెప్పలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.