WFI Suspension : కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్యానెల్ను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారతీయ రెజ్లింగ్ పోటీల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించడంతో సస్పెన్షన్ వేటు వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కేంద్ర క్రీడాశాఖ తెలిపింది.
దీంతో WFIకి కొత్తగా నియమితులైన సంజయ్ సింగ్ సస్పెండ్ అయ్యారు. సంజయ్ సింగ్ బీజేపీ ఎంపీ, మాజీ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు. సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికను ఇప్పటికే రెజ్లర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యారు. బజరంగ్ పునియా కూడా తన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడీ నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం నిర్ణయం వెనుక సంజయ్ సింగ్ పగ్గాలు చేపట్టగానే తీసుకున్న నిర్ణయం కారణంగా కనిపిస్తోంది. ఆయన అండర్ -15, అండర్ -20 జాతీయ రెజ్లింగ్ పోటీలను ఈ ఏడాది చివరినాటికి ఉత్తర ప్రదేశ్ లోని నందినీ నగర్, గోండాలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన WFI, క్రీడాశాఖ నిబంధనలకు విరుద్ధం. పోటీని ప్రారంభించడానికి కనీసం 15రోజుల ముందు ప్రకటన ఇవ్వాలి. అప్పుడే పోటీల్లో పాల్గొనేందుకు రెజ్లర్లు సిద్ధం కావచ్చు. అంతేకాక యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎగ్జిక్యుటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్ జూనియర్, సీనియర్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాలి. నిబంధనలు పాటించకుండా పోటీల నిర్వహణకు కొత్త ప్యానెల్ ప్రకటన విడుదల చేసింది. దీంతో క్రీడా మంత్రిత్వ శాఖ కొత్త ప్యానెల్ ను సస్సెండ్ చేసింది.
గీతా ఫొగట్ కేంద్ర నిర్ణయంపై ట్వీట్ చేశారు. క్రీడా మంత్రిత్వ శాఖ WfI ప్యానెల్ ను సస్పెండ్ చేసింది. ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రెజ్లర్లకు న్యాయం జరుగుతుందనే ఆశ కలిగించిందని అన్నారు. ఇదిలా ఉంటే.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంపై సంజయ్ సింగ్ కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.