Hyderabad Fire Accidents : హైదరాబాద్.. ఇప్పుడు ఈ నగరం అగ్నిప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. నగరంలో ఎప్పుడు.. ఎక్కడ.. ఏ అగ్నిప్రమాదం గురించి వినాల్సి వస్తుందోనని నగర వాసులు హడలిపోతున్నారు. శనివారం గుడిమల్కాపూర్లోని అంకుర ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంతో మరోసారి నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఏం జరుగుతుందో కాసేపు ఎవరకీ అర్థంకాలేదు. గత నెల నవంబర్లో నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఆ ఘటన మరువక ముందే మరో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నగరంలో ఎక్కడో ఓ చోట ఎప్పుడూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటుండంతో నగర వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
నిన్న గుడిమల్కాపూర్, మొన్న నాంపల్లి, అంతకు ముందు సికింద్రాబాద్, వనస్థలిపురం, గోశామహల్, రాజేంద్రనగర్ ఇలా వరుస అగ్నిప్రమాదాలు భాగ్యనగరాన్ని బెంబెలెత్తిస్తున్నాయి. ఏడాదిన్న వ్యవధిలో ఏకంగా హైదరాబాద్ నగరంలో దాదాపు 37 మంది అగ్నికి ఆహుతయ్యారంటే అధికారయంత్రాంగా ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇళ్ల మధ్యే రసాయనాలు నిల్వ చేస్తున్న పట్టించుకోరు. ఫైర్ సేఫ్టీ పాటించకున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడరు. ప్రమాదం జరిగిందంటే ఇట్టే అక్కడ వాలిపోయి..ఏదో హాడావుడి చేస్తారు. అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకుని తరువాత ఆ సంఘటన గురించే మర్చిపోతారు. ఫలితంగా జనాల ప్రాణాలు అగ్నిఆహుతవుతున్నాయి.
2021లో రాష్ట్రవ్యాప్తంగా 139 అగ్నిప్రమాదాలు జరిగాయి. 2022లో 236 ప్రమాదాలు జరిగితే.. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 135 వరకు అగ్ని ప్రమాదాలు జరిగాయి. నిన్నటి గుడిమల్కాపూర్, మొన్నటి నాంపల్లి బజార్ఘాట్ ప్రమాదంతో పాటు.. గడిచిన ఏడాదిన్నర కాలంలో భాగ్యనగరంలోనే ఐదు ఘోర దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఏకంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్ బోయిగూడలోని ఓ గోదాంలో గతేడాది మార్చిలో జరిగిన ప్రమాదంలో 11 మంది బిహారీ వలస కూలీలు అగ్నికి ఆహుతయ్యారు. గతేడాది సెప్టెంబరులో సికింద్రాబాద్ రూబీ హోటల్ సెల్లార్లో జరిగిన దుర్ఘటనలో 8 మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ నిట్ వేర్, స్పోర్ట్స్ షాపులో గత జనవరిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు బిహారీలు దుర్మరణం పాలయ్యారు. మార్చి నెలలో సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. బజార్ ఘాట్లో జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
నగరంలో వరుస అగ్నిప్రమాదాలతో కాస్త ఆలస్యంగానైనా మేల్కొన్న జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలో ఇళ్ల మధ్యలో అగ్ని ప్రమాదాలకు ఆజ్యం పోసే రసాయనాల నిల్వ చేస్తే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇలాంటి చర్యలు మొక్కుబడిగా కాంకుడా శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు అడుగులు వేసి చర్యలు తీసుకుంటే అగ్నిప్రమాదాలు నివారించవచ్చంటున్నారు నగర వాసులు.