Lok Sabha Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ… ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్ సభలోనూ రిపీట్ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పీఏసీ సమావేశం నిర్వహించి పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ చార్జీలను నియమించింది హస్తం పార్టీ. ఈ సమావేశంలోనే ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల జరిగిన శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి భంగపడినవారు, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించినవారు, పదేళ్లుగా పార్టీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకు తొలి ప్రాధాన్యమివ్వాలని సమావేశంలో తీర్మానించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులు ఆశిస్తున్న నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు, కీలక మంత్రులు, నేతలను కలిసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.
ఇటు మరోసారి టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విస్తృత కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇవాళ జరగాల్సి ఉండగా ఇది వాయిదా పడింది. త్వరలోనే ఈ భేటీ జరగనుంది. తెలంగాణలోని 17లోక్సభ స్థానాల్లో 15 గెలవడమే టార్గెట్గా పెట్టుకుని కదనరంగంలోకి ముందుకు సాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది టీ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వార్ రూమ్ స్ట్రాటజీనే సార్వత్రిక ఎన్నికల్లో వాడుకుని బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు త్వరలో జరగబోయే సమావేశానికి పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ చైర్మన్లు హాజరుకానున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికలు బిగ్ టాస్క్ గా మారాయి. గత ఎన్నికల్లో కేవలం మూడు ఎంపీలను గెలుచుకున్న హస్తం పార్టీ ఈసారి అధికార పార్టీ హోదాలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఏయే సెగ్మెంట్లలో ఉన్న బలాబలాలేంటో బేరీజు వేసుకుని పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత మార్పులకు సైతం శ్రీకారం చుట్టబోతుంది.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డినే పీసీసీగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇటు పాలన వ్యవహారాలు మరో వైపు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు ఉండవని భావిస్తున్న అధిష్టానం పూర్తిస్థాయిలో కొత్త పీసీసీకే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కొత్త పీసీసీకి సంబంధించిన రాష్ట్ర నేతలకు అధిష్టానం నుంచి కీలక సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో త్వరలో జరగబోయే సమావేశంలో పీసీసీ ఎంపికపై నేతల అభిప్రాయాన్ని సేకరించే అవకాశం ఉంది. అలాగే అన్ని జిల్లాలకు కొత్త డీసీసీల నియామకం, డీసీసీలకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ కమిటీలు, అసెంబ్లీ ఎన్నికల తరహాలో వార్ రూమ్ నుంచి సాగించాల్సిన వ్యూహాలు, అగ్రనేతల పర్యటనలు, ప్రచార అంశాలు వంటి అంశాలపై మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి అధిష్టానానికి అందజేయనున్నారు.