Anganwadi Strike : ఆంధ్ర ప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగులు పోరాటం ఉద్ధృతంగా కొనసాగుతోంది. తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనం ఇస్తామని ఏపీ సీఎం హామీ ఇచ్చి.. మాట తప్పారని.. అంగన్వాడీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. 14వ రోజూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని.. ఫేస్ రికగ్నైజేషన్ విధానం రద్దు చేయాలని కోరుతూ సమ్మె కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు.. ఆయాలు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించారు.
వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అంగన్వాడీలు పోరాటం చేస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరులో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నదిలో జలదీక్ష చేపట్టారు. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర ఘాట్లోనూ కార్యకర్తలు జలదీక్ష చేశారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ఏర్పాటుచేసి కార్యకర్తలు పూజలు చేశారు. పొర్లుదండాలు పెడుతూ ఆందోళన చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో మండుటెండలో నిరసన తెలియజేస్తుండగా వేమూరి ఊర్మిళ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయారు. ఇచ్ఛాపురం వచ్చిన శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టరు నవీన్, ఆర్డీవో భరత్నాయక్ కార్లను కార్యకర్తలు అడ్డుకున్నారు. విజయవాడ ధర్నాచౌక్లో అంగన్వాడీల ఆందోళనకు డీవైఎఫ్ఐ మద్దతు ప్రకటించింది.
ఒక NRI యువకుడిని అరెస్టు చేయడానికి ప్రత్యేకంగా పోలీసులను పక్క రాష్ట్రానికి పంపిన సీఎం.. ఏపీలోని అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడానికి మాత్రం తీరికలేదని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. దీన్ని బట్టే సీఎం జగన్ ప్రాధాన్యతలేంటో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, నోటీసులతో ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని వేధించడం కోసం వెచ్చిస్తున్న సమయాన్ని అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై పెట్టాలని హితవుపలికారు. న్యాయమైన డిమాండ్ల కోసమే అంగన్వాడీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం సీఎం జగన్ అహంకార ధోరణికి నిదర్శనమని చంద్రబాబు ధ్వజమెత్తారు.
అసలు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి లేకపోగా… శాంతియుతంగా చేపట్టిన నిరసనలను అణిచివేయాలని చూడటం దుర్మార్గమని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులను ఆదుకుందని.. 6,300 గా ఉన్న జీతాన్ని 10,500కు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.