GIG Workers : గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం కీలక హామీలు ఇచ్చింది. క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్లు, ఆటో డ్రైవర్ల కోసం 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
4 నెలల క్రితం స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమడంతో భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటనపై సీఎం ఆరా తీశారు. మృతుడి కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందించాలని అధికారులకు సిఎం ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్లు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలనుం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సామాజిక రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇందుకోసం రాజస్థాన్ లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్ధవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చా రు. సంస్థలు కూడా కేవలం లాభాపేక్ష మాత్రమే చూడకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. గివ్ అండ్ పాలసీని పాటించని ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాబోమని హెచ్చరించారు.
4 నెలల క్రితం స్విగ్గి బాయ్ కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందాడని… అప్పటి ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సాయం అందిస్తారని చూశా.. కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పారు. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని అన్నారు. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి 2 లక్షల రూపాయలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన గ్రామసభలు నిర్వహిస్తున్నామని, అక్కడ దరఖాస్తుల్లో వివరాలు అందించండని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చు అన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తామని, ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సిఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎఐసిసి సెక్రెటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, మాధుయాష్కీ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ హామీ ప్రకారం మీటింగ్ పెట్టామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గిగ్ వర్కర్స్ కోసం యాప్ సర్వీస్ను ప్రారంభిస్తామని, ఇప్పటికే కనెక్టివిటీ ఉన్న వారు..ఇన్స్యూరెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పారు. తొందర్లొనే ఆటో యూనియన్తో భేటీ అవుతామన్నారు మంత్రి పొన్నం. ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని, కచ్చితంగా వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రతి కార్మికుడి రక్షణ తమ బాధ్యత అని చెప్పారు. వేరే పార్టీలు ఆటో యూనియన్లను రెచ్చగొట్టి.. తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్.