Telangana Congress Incharge : సార్వత్రిక ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా సంస్థాగతంగా భారీ మార్పులను చేపట్టింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ జనరల్ సెక్రటరీలు, ఇన్చార్జ్లను మార్చింది. ఇప్పటి దాకా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న మాణిక్రావ్ ఠాక్రేను ట్రాన్స్ఫర్ చేసింది. ఆయన స్థానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా, జనరల్ సెక్రటరీగా దీపాదాస్ మున్షీని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కేరళ, లక్షద్వీప్తో పాటు అదనంగా ఆమెకు తెలంగాణ బాధ్యతలను అప్పగించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జారీ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికి పార్టీ చీఫ్ అబ్జర్వర్గా పనిచేశారు మున్షీ. ఆ సమయంలో పార్టీ నేతలను కో ఆర్డినేట్ చేయడంలో సక్సెస్ అయ్యారనే పేరు పార్టీలో ఉంది. ఈ క్రమంలోనే దీపాదాస్ మున్షీకి రాష్ట్ర బాధ్యతలను అప్పగించారు.
ప్రస్తుతం రాష్ట్రానికి ఇన్చార్జ్గా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేకు గోవా, దాద్రానగర్ హవేలి, డయ్యూ డామన్కు ఇన్చార్గా బాధ్యతలు అప్పగించారు. ఠాక్రే మార్పు వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఆయనను తెలంగాణకు పంపిన టార్గెట్ అయిపోయిందని, అందుకే ఇప్పుడు మరో రాష్ట్రానికి పంపారని.. అది కూడా ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు దగ్గరగా ఉండే గోవాకు పంపారని అంటున్నాయి.
ఎన్నికల టైంలో ఏఐసీసీ మీడియా కో ఆర్డినేటర్గా తెలంగాణలో పనిచేసిన సీడబ్ల్యూసీ మెంబర్ అజయ్ కుమార్ను ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి ఇన్చార్జ్గా నియమించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న మాణిక్కం ఠాగూర్కు ఏపీ, అండమాన్ నికోబార్ బాధ్యతలను అప్పగించారు. మొత్తంగా 12 మందికి జనరల్ సెక్రటరీ, 12 మందికి ఇన్చార్జ్ బాధ్యతలను కాంగ్రెస్ అధిష్ఠానం అప్పగించింది. ఇక, ట్రెజరర్గా అజయ్ మాకెన్, జాయింట్ ట్రెజరర్లుగా మిలింద్ దేవరా, విజయ్ ఇందర్ సింఘ్లాను నియమించింది.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ పార్టీ ఇన్చార్జులను కాంగ్రెస్ అధిష్ఠానం మార్చింది. ఇప్పటి వరకూ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జిగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండడంతో ఆమెకు నిర్ధిష్ట రాష్ట్ర బాధ్యత అప్పగించలేదు. ఆమె స్థానంలో యూపీ బాధ్యతను మహారాష్ట్రకు చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండేకు అప్పగించింది. సచిన్ పైలట్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆయనకు ఛత్తీస్గఢ్ బాధ్యతలు అప్పగించింది. అలాగే, ముకుల్ వాస్నిక్కు గుజరాత్, జీఏ మిర్కు జార్ఖండ్తోపాటు పశ్చిమ బెంగాల్ అదనపు బాధ్యత కూడా ఇచ్చింది. హరియాణా నేత కుమారి షెల్జాకు ఉత్తరాఖండ్, కేరళ నేత రమేశ్ చెన్నితాలకు మహారాష్ట్ర పార్టీ వ్యవహారాలను కేటాయించింది. అసోంతోపాటు మధ్యప్రదేశ్ అదనపు ఇన్చార్జిగా జితేందర్ సింగ్, కర్ణాటక ఇన్చార్జిగా రణదీప్ సూర్జేవాలాను నియమించింది.