TDP NRI Leader Arrest : టీడీపీ ఎన్ఆర్ఐ (NRI) నేత పొద్దులూరి యశస్వి (యశ్)ని ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. అస్వస్థతకు గురైన తన తల్లిని చూసేందుకు యశ్ అమెరికా నుంచి వచ్చారు. శంషాబాద్ పోలీసులు యశ్ వస్తున్నారని ఏపీ సీఐడీకి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఏపీ సీఐడీ శంషాబాద్ లో యశ్ ను అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు. ఏపీ సీఐడీ యశ్ పై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకుగానూ యశ్ పై కేసు నమోదు చేశారు.
యశ్ నిర్బంధం పట్ల ఎన్ఆర్ఐ టీడీపీ నేత కోమటి జయరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి వంద రోజుల్లోనైనా ప్రజాస్వామిక పాలన అందిస్తారేమో అని భావించిన ప్రవాసాంధ్రుల ఆశలను వమ్ము చేస్తూ.. జగన్ ప్రభుత్వం తన వక్ర బుద్ధిని కొనసాగిస్తోందని జయరామ్ విమర్శించారు. యశ్ ను అక్రమంగా అరెస్టు చేశారని.. వెంటనే విడుదల చేయాలని జయరామ్ డిమాండ్ చేశారు.
యశ్ అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ.. నిన్న రాత్రి హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్ఆర్ఐ యశ్ బొద్దులూరిని అక్రమంగా అరెస్టు చేసిన విషయం తెలిసి షాక్కు గురయ్యానన్నారు. ఈ క్రూరమైన ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకుంటోంది అన్నారు. ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు.. యశ్ విదేశాల నుంచి రాగానే అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడుతమని అన్నారు. వైఎస్సార్సీపీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు.
ఏపీ సీఐడీ అధికారులు 41 A నోటీస్ ఇచ్చి యశ్ ని విడుదల చేశారు. తదుపరి విచారణకు రావాల్సి ఉంటుందని ఏపీ సీఐడీ అధికారులు యశ్ కు అదేశించారు.