Vyuham Movie : రాంగోపాల్వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విడుదల నిలిచిపోయింది. సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారించి.. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీ, ఆన్లైన్, ఇంటర్నెట్, థియేటర్ సహా మరే వేదికల్లోనూ దీనిని విడుదల చేయరాదని ఆదేశించింది.
దర్శకుడు రాంగోపాల్ వర్మ.. టీడీపీని, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా సినిమా తీశారని లోకేశ్ పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలో.. పిటిషనర్ కుటుంబ సభ్యులు, పార్టీకి సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, సినిమాను విడుదల చేస్తే పిటిషనర్ హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని లోకేష్ తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు.
దీనిని విచారించిన సిటీ సివిల్ కోర్టు రెండో అడిషనల్ చీఫ్ జడ్జి సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులైన రామదూత క్రియేషన్స్ సంస్థ, నిర్మాత దాసరి కిరణ్ తదితరులకు సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. మరోవైపు వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలుగుదేశం పార్టీని, పార్టీ అధినేత చంద్రబాబును అప్రతిష్ఠపాలు చేసేందుకు ఈ సినిమా తీశారని అందులో పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ చట్టం 1952, సెక్షన్-5(బీ), 1991లో జారీ చేసిన రివైజ్డ్ గైడ్ లైన్స్, రాజ్యాంగంలోకి ఆర్టికల్ 14,21, సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేశారని పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రతిష్ఠకు, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దురుద్దేశంతో వ్యూహం సినిమాలో పాత్రలు రూపొందించారని, పాత్రలను తప్పుడు కోణాల్లో చిత్రీకరించారని లోకేష్.. పిటీషన్లో పాల్గొన్నారు. ఇది తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్కుమార్, దర్శకుడు రాంగోపాల్వర్మలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ ఈనెల 26న విచారణకు రానుంది.
మరోవైపు.. వ్యూహం సినిమా ప్రిరిలీజ్కు యూనిట్ ఏర్పాట్లు చేసింది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను.. దర్శకుడు రాంగోపాల్ వర్మ, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పరిశీలించారు.