Road Accident : రెండు వేరు వేరు ప్రమాదాలలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలోని 44 హైవే పై చోటుచేసుకుంది.
వివరాలోకి వెళ్తే.. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలోని 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రైస్ మిల్లు వద్ద బియ్యం పాలిష్ చేసుకుని ట్రాక్టర్ లో లోడ్ చేసి.. గుత్తి మండలం మాముడూరు గ్రామానికి వెళ్తున్నారు. బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఓ ప్రైవేట్ వోల్వో బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
అలాగే పామిడి పట్టణ శివారులో మరో ప్రమాదం జరిగింది. లారీని ఐచర్ వాహనం వెనక నుంచి ఢీకొట్టడంతో.. ఒకరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.
రెండు ప్రమాదాల్లో మృతి చెందిన వారిని గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన చిన్న తిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులు, వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.