Karimnagar-Tirupati Train : కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. బీజేపీ ఎంపీ బండి సంజయ్ చొరవతో కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులపాటు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రస్తుతం గురు, ఆదివారాల్లొ మాత్రమే నడిచే ఈ ట్రైన్.. ఇక మీదట వారంలో నాలుగు రోజులపాటు నడవనుంది.
బండి సంజయ్ ఈరోజు ఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిశారు. రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుండి తిరుపతి బైవీక్లీ ట్రైన్ను వారానికి నాలుగు రోజులపాటు పొడిగించాలని ఆయన కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం గురు,ఆదివారాల్లో మాత్రమే నడుస్తున్న ఈ ట్రైన్ను మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణీకుల రద్దీని సమీక్షించిన అనంతరం ఏయే రోజుల్లో ట్రైన్ను నడపాలనే దానిపై ప్రకటన చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
కరీంనగర్-హసన్పర్తి రైల్వేలైన్ సర్వే పనుల గురించి బండి సంజయ్ రైల్వే మంత్రితో చర్చించారు. సర్వే పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు జమ్మికుంటలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి.
అందులో భాగంగా సికింద్రాబాద్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్(12590), గోరఖ్పూర్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్(12589), హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ (12723), న్యూఢిల్లీ హైదరాబాద్ తెలంగాణ ఎక్స్ప్రెస్ (12724), యశ్వంతపూర్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ (12592), గోరఖ్పూర్-యశ్వంతపూర్(12591); సికింద్రాబాద్-పాట్నా దానాపూర్ ఎక్స్ప్రెస్ (12791), పాట్నా-సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్(12792); చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్(12656), అహ్మదాబాద్ చెన్నై నవజీవన్ ఎక్స్ప్రెస్ (12656) రైళ్లను జమ్మికుంట స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు.
సాధ్యాసాధ్యాలను పరిశీలించి తర్వాత ఆయా రైళ్లను జమ్మికుంటలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశించారు.