Dharna Chowk : హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన విరమించింది. పార్లమెంట్ లో విపక్ష ఎంపీల బహిష్కరణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఉవ్వెత్తున నిరసనకు దిగాయి. ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళన పిలుపు నేపథ్యంలో తెలంగాణలోనూ శాంతియుత ధర్నా కార్యక్రమాలు జరిగాయి.
హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఆందోళనలు నిర్వహించారు. సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ర్యాలీలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొనసాగిన ఆందోళనకు సీపీఐ,టీజేఎస్,ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు.
పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. ప్రస్తుతం అరాచక పాలనలో దేశం మగ్గుతోందని ఆయన తెలిపారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై ఇప్పటి వరకూ కేంద్ర హోంమంత్రి నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.