కాంగ్రెస్ సర్కారు రంగంలోకి దిగడంతో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయి. అంతకు ముందు ఒప్పందం గడువు ముగియడంతో.. మరమ్మతులు చేయబోమని ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ బుకాయించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో బ్యారేజీకి మరమ్మతు పనులు మొదలయ్యాయి.
ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీకి ఎడమ వైపు మహారాష్ట్ర నుంచి కాఫర్ డ్యాం నిర్మించేందుకు ఎల్అండ్ టీ సంస్థ మట్టి పనులు చేపట్టింది. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచే ముందుగా పనులు మొదలుపెట్టారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో కదిలిక రావడంతో మళ్లీ కాళేశ్వరం నీళ్లపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ లో 21వ పిల్లరు అక్టోబరు 21న కుంగిపోయింది. కుంగుబాటుకు గల కారణాలు తెలుసుకొని పునరుద్ధరిస్తామని ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది. గత ప్రభుత్వం లోని మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత వహించి బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపడుతుందని ప్రకటించారు. అయితే ఈ నెల 2న ఎల్ అండ్ టీ కంపెనీ పునరుద్ధరణ పనులపై మాట మార్చింది. బ్యారేజీ నిర్మాణం సమయంలో కుదుర్చుకున్న డిఫెన్స్ లయబిలిటీ పీరియడ్ రెండేళ్ల వరకే ఉందని.. 2022 జూన్ 29తోనే ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించింది. మళ్లీ పునరుద్ధరణ పనులు చేయాలంటే కొత్తగా ఒప్పందం చేసుకోవాలని లేఖ రాసింది. అంతేగాక కాఫర్ డ్యాం నిర్మాణానికి రూ.55.75 కోట్లు కావాలని పేర్కొంది.
దీంతో సీఎం రంగంలోకి దిగి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎల్ అండ్ టీ ప్రతినిధులతో కూడా సమావేశమై.. పనులు పూర్తి కాకుండా బాధ్యతల నుంచి ఎలా తప్పించుకుంటారని ప్రశ్నించారు. తప్పుచేసి తప్పించుకోవాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దాంతో ఈ సమీక్ష జరిగిన మూడు రోజుల తర్వాత ఎల్అండ్ టీ సంస్థ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాం పనులను మళ్ళీ మొదలుపెట్టింది.
ఈ పనులు పూర్తయిన తర్వాత అన్ని బ్లాకుల్లో పిల్లర్ల పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణులతో పరిశీలన చేయనున్నారు. కేవలం 7వ బ్లాక్ వరకే కుంగుబాటు పరిమితమైతే ఇక్కడే పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. నిపుణులు మాత్రం 18, 19, 20, 21, 22 పిల్లర్లపైనా కుంగుబాటు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 7వ బ్లాక్ నే పునరుద్ధరించాల్సి వస్తే సుమారు రూ.600 కోట్ల వరకు ఖర్చు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.