రండి బాబూ రండి.. ట్రాఫిక్ చలానా కట్టండి. రాయితీ పొందండి. ఇదీ.. తెలంగాణలో పోలీసులు.. వాహనదారులకు ఇచ్చిన బంపర్ ఆఫర్. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాలను వసూలు చేసేందుకు పోలీసుశాఖ మరోమారు సన్నద్దమయ్యింది. ఇందుకు అధికారులు భారీగా రాయితీలు ఇచ్చారు.
చలాన్లపై గతం కంటే ఎక్కువ డిస్కౌంట్ను పోలీసులు ప్రకటించారు. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు చలానాలపై రాయితీ వర్తింపు ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్.. ద్విచక్ర వాహనాలకు 80 శాతం .. ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం.. లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్కు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.
గతేడాది ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా 300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. ఇదే తరహాలో మరోసారి రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చలానాలు విధిస్తారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్నతరహా పట్టణాల్లోనూ చలానాలు విధిస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి, చలానాలు విధించడం ఈజీగా మారింది. ఇలా చేస్తున్నా.. చాలా మంది చలానాలను మాత్రం చెల్లించడం లేదు. పోలీసులు తనిఖీలు నిర్వహించి, వాహనం నంబరు ఆధారంగా దానిపై ఉన్న చలానాలను పరిశీలించినప్పుడు మాత్రమే పెండింగ్లో ఉన్నట్టు బయటపడుతోంది. ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్లో ఉంటున్నాయి.
2022 మార్చి 31 నాటికి.. తెలంగాణలో 2 కోట్ల 40 లక్షల చలానాలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో 300 కోట్ల వరకూ వసూలయ్యాయి. దాదాపు 65 శాతం చలానాలు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ పెండింగ్ భారం పెరిగిపోతోంది. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ రెండు కోట్లకు చేరుకుందని అధికారులు అంచనా వేశారు. అందుకే మరోసారి రాయితీ ప్రకటించారు.