2023 సంవత్సరం మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో హైదరాబాద్ లో జరిగిన క్రైమ్ వివరాలను సీపీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే.. నగరంలో 2 శాతం క్రైమ్ రేటు పెరిగిందన్నారు. హైదరాబాద్ పరిధిలో 24,821 కేసులు నమోదైనట్లు వివరించారు. 79 హత్యలు, 403 అత్యాచారం కేసులు, 242 కిడ్నాప్ కేసులు, 4,909 చీటింగ్ కేసులు నమోదయ్యాయయని సీపీ తెలిపారు.
నగరంలో దోపిడీల కేసులు 9 శాతం, మహిళలపై దాడులు 12 శాతం, అత్యాచారం కేసులు 19 శాతం పెరిగాయని పేర్కొన్నారు. చిన్నారులపై నేరాలు గతేడాది కంటే 12 శాతం తగ్గాయన్నారు. 2023 సంవత్సరంలో వివిధ కేసుల్లో రూ.38 వేల కోట్ల నష్టం జరగగా.. 75 శాతం సొత్తును రికవరీ చేసినట్లు తెలిపారు. ఈఏడాది 740 మందిని మత్తు పదార్థాలు వాడిన కేసులో అరెస్ట్ చేయగా.. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు అరెస్టయ్యారు.
అలాగే.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 37 వేల కేసులు నమోదవ్వగా.. రూ.91 లక్షల ఫైన్లను విధించామన్నారు. వీటిలో 556 మంది లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు సీపీ తెలిపారు. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 280 మంది మరణించినట్లు చెప్పారు. గతేడాది సైబర్ నేరాలు రూ.82 కోట్ల మేర జరిగితే.. ఈ ఏడాది కేటుగాళ్లు రూ.133 కోట్లను కాజేశారని తెలిపారు. ఆర్థిక నేరాలపై గతేడాది 292 కేసులు నమోదైతే.. 2023లో 344 కేసులు నమోదయ్యాయని సీపీ వివరించారు. పోక్సో కేసులు 12 శాతానికి తగ్గగా.. సైబర్ నేరాలు 11 శాతం పెరిగినట్లు చెప్పారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సీపీ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ఎక్కడ ఉన్నా వెతికి మరీ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై ఫోకస్ ఉందన్నారు. డ్రగ్స్ ను పట్టుకునేందుకు స్నిపర్ డాగ్స్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.