కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. మొన్నటివరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. తాజాగా ఏపీలోని ఏలూరులో కొవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. ప్రయివేట్ మెడికల్ కాలేజీ వైద్యుడికి కరోనా వైరస్ సోకింది. అయితే ఆ వేరియంట్ ఏంటో నిర్థారించేందుకు శాంపిల్స్ ను హైదాబాద్కు తీసుకొచ్చారు.
తెలంగాణలోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 24 గంటల్లో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 19కి చేరింది.
ఇక భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 2,997 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. కరోనా కేసులు మళ్లీ పెరగడానికి కొత్త వేరియంట్ జేఎన్.1 కారణమని తెలుస్తోంది.
కేరళలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. 24గంటల్లో 265 కొత్త కేసులు నమోదు కాగా ఒక మరణం సంభవించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.