TS Weather: మంచిర్యాల జిల్లాల్లో చలి పంజా విసురుతుంది. గత నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో చలి తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రజలు ఉదయం 10 గంటల వరకు బయటకు వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం 5 దాటిందంటే చలి తీవ్రమవుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో పొగ మంచు ఉండటం వల్ల ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
జిల్లాల్లో సగటున 10 నుండి 11 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో విద్యార్థులు, ఉద్యోగులు చలి బారిన పడాల్సి వస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులకు వెళ్లే సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిడిల్ షిఫ్ట్ ముగించుకొని ఇండ్లకు వెళ్లేవారు, ఉదయం, రాత్రి షిఫ్టు సమయాల్లో విధులకు వెళ్ళి తిరిగి ఉదయం వచ్చేటప్పుడు సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాలలకు వెళ్లే చిన్నారులు సైతం ఉదయం చలికి తట్టుకోలేక పోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చే చిరు వ్యాపారులు, పాల వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చలి తీవ్రత కారణంగా వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. చలి పులిలా పంజా విసురుతుండడంతో రానున్న రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రతకు ఉక్కిరిబిక్కిరవుతూ రక్షణ కోసం ఉదయం నుంచి రాత్రి వరకు స్వెట్టర్లు, జర్కిన్లు, గ్లౌజులు, మఫ్లర్లు ధరిస్తున్నారు.
సాయంత్రమైందంటే చాలు కాలనీల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. చలి తీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తుల కొనుగోలుకు విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరారు. అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా చలితీవ్రత పెరిగి జ్వరం, దగ్గు, జలుబు, ఫ్లూ వంటి రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత ఇంకా పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో.. ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.