Sridhar Babu: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలనే చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శాసనసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి, ప్రజలను పదేళ్లపాటు ఎలా మభ్యపెట్టిందో శ్వేతపత్రాల ద్వారా వివరించామని శ్రీధర్ బాబు తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సభ్యుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఒక ప్రయత్నం చేశామన్నారు. అప్పులు చేశాం.. చేసిన అప్పుల వల్ల అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని స్వయంగా బీఆర్ఎస్ నేతలే చెప్పారని శ్రీధర్ బాబు తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా ప్రజాధనం ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు ఒక్కొక్కరిపై రూ.7 లక్షల అప్పును గత ప్రభుత్వం మోపిందన్నారు.