BRS the rich regional party | గులాబీ పార్టీ అకౌంట్ ను ఒకలా.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను మరోలా డీల్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ కు నెలకు 7 కోట్లు వడ్డీ వచ్చేలా చూసుకున్నారు. అదే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాదు.. విపరీతమైన అప్పుల భారం మోపి ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
BRS the rich regional party | గులాబీ పార్టీ అకౌంట్ ను ఒకలా.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను మరోలా డీల్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ కు నెలకు 7 కోట్లు వడ్డీ వచ్చేలా చూసుకున్నారు. అదే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాదు.. విపరీతమైన అప్పుల భారం మోపి ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
BRSకు ఉన్న పార్టీ ఫండ్ తో నెలకు ఏకంగా 7 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉండే పరిస్థితి తలెత్తినా.. పార్టీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా, వ్యూహాత్మకంగా, ఆర్థికంగా పార్టీని బలోపేతం చేసుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎంతో ముందు చూపుతో ఆర్థిక ఇబ్బందులు రావొద్దని సొంత పార్టీ ఆర్థిక వ్యవస్థను చాలా పకడ్బందీగా సెట్ చేసి పెట్టుకున్నారు. అదే సమయంలో పాలనాంశాలకు సంబంధించి చూస్తే.. పదేళ్లలో ఆర్థిక విధ్వంసం చేసి కూర్చుకున్నారన్నది ఇప్పటి ప్రభుత్వం ఆరోపణ. ఎడా పెడా అప్పులు, అధిక వడ్డీలకు అప్పులు, కార్పొరేషన్ రుణాలు.. అప్పు ఎక్కడ పుడుతుందో అన్ని చోట్లా బాకీలు తెచ్చి.. వాటికి తగ్గ పనులు చేయకుండా ప్రభుత్వ ఖజానా ఖాళీ చేయడమే కాదు.. పైగా ప్రజలు ఒక్కొక్కరిపై లక్షల రూపాయల అప్పు భారం మోపి అధికారం నుంచి తప్పుకున్నారు.
సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖజానా కాసుల గలగలతో కళకళలాడుతోంది. భారీగా ఫండ్, ఫిక్స్ డ్ డిపాజిట్లు.. వాటికి వడ్డీలు… ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారు. అదే ప్రజలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా మాత్రం అప్పుల కుప్ప మోయలేక దివాళా తీసే పరిస్థితి తెచ్చారు. లక్షల కోట్ల అప్పులు చేసినా ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6.7 లక్షల కోట్ల అప్పులకు తోడు ఇతర రుణాలు కలిపితే 8 లక్షల కోట్లకు పైనే బాకీలు చేసి పెట్టారు. ఎంతలా అంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ఏకంగా 34 శాతం అసలు, వడ్డీలకు కేటాయించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్. పైగా రోజూ ఓవర్ డ్రాఫ్ట్ లపైనే ప్రస్తుత ప్రభుత్వం ఆధారపడేలా ఇంకా చెప్పాలంటే దినదిన గండం అన్నట్లుగా ఆర్థిక అరాచకం చేసి వెళ్లారన్న విమర్శల్ని ప్రస్తుత ప్రభుత్వం వినిపిస్తోంది. ఒకవైపు పార్టీ ఆర్థిక పరిస్థితిని పకడ్బందీగా సెట్ చేసుకున్న కేసీఆర్.. ఇంకోవైపు ప్రభుత్వానికి ఎక్కడా అప్పు కూడా పుట్టకుండా చేసేశారు. ఇది ఇంకా దారుణమైన విషయం. ఎవరూ అప్పు ఇవ్వకపోతే.. ఇప్పుడు రోజూ ఆర్బీఐ ముందు భిక్షాందేహి అంటూ ఓడీ కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి తెచ్చారు. ఇంతకంటే దారుణం ఉంటుందా అన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న.
అక్టోబర్ 21, 2021 ప్లీనరీ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ పార్టీకి 425 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, అవి నెలకు రెండు కోట్ల రూపాయల వడ్డీని ఇస్తాయని చెప్పారు. సీన్ కట్ చేస్తే ఈ ఏడాది ఏప్రిల్ లో ఇదే కేసీఆర్ చెప్పిందేంటంటే.. భారత రాష్ట్ర సమితి వద్ద 1,250 కోట్ల పార్టీ ఫండ్ ఉందని, 767 కోట్ల బ్యాంకు డిపాజిట్లతో కలిపి నెలకు 7 కోట్ల వడ్డీ వస్తుందన్నారు. ఏకంగా పార్టీ ఆస్తులను సంపదను ఏడాదిన్నరలోనే మూడు రెట్లు పెరిగేలా చూసుకున్నారు. మరి అదే ప్రభుత్వ ఖజానాను మాత్రం గాలికి వదలేశారన్న విమర్శలు పెరుగుతున్నాయి. రెండోసారి అధికారంలోకి రాగానే.. కేసీఆర్ చేసిన పని ఏంటంటే… అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల కోసమంటూ ప్రైమ్ లొకేషన్లలో చాలా తక్కువ ధరకే ప్రభుత్వ భూములను ప్రభుత్వం తరపున తమ పార్టీకి కేటాయించుకున్నారు. వివాదాలు నడిచినా.. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు. ఇదీ కేసీఆర్ సొంత పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసుకుని… రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దివాళా తీయించిన విధానమని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మరి ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ దగ్గర సమాధానం ఉందా?