MUNUGODU BYPOLL : సాధారణంగా ఉపఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో మాత్రం సాధారణ ఎన్నికలను మించి పోలింగ్ జరిగింది. 2.1 శాతం పోలింగ్ ఎక్కువగా నమోదైంది. 2018 ఎన్నికల్లో మునుగోడులో 91.03 శాతం పోలింగ్ నమోదైంది. తాజాగా జరిగిన ఉపఎన్నికలో రికార్డుస్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉన్నాయి. అందులో 2,25,192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో 686 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో చాలా పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓట్లేశారు. ఈవీఎంలను అర్ధరాత్రి ఒంటి గంట 30 నిమిషాలకు అధికారులు సీల్ చేశారు. ఈవీఎంలను 4 గంటల 45 నిమిషాలకు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. నవంబర్ 6న కౌంటింగ్ చేపడతారు. 22 టేబుళ్లలో కౌంటింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించింది.
మునుగోడులో 2018 ఎన్నికల కంటే 2 శాతంపైగా ఓటింగ్ పెరిగింది. అంటే గతంలో కంటే 4 వేలకుపైగా ఓట్లు అధికంగా పోలయ్యాయి.హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికలో ఈ 2 శాతం ఓట్లే కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే సర్వేలన్నీ కారు దూసుకుపోతోందని ప్రకటించాయి. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నా మునుగోడులో గులాబీ జెండానే ఎగురుతుందని స్పష్టం చేశాయి. టీఆర్ఎస్ కనీసం 5 శాతంపైగా ఓట్ల తేడాతో గెలుస్తుందని సర్వేలన్నీ తేల్చాయి. అంటే టీఆర్ఎస్ అభ్యర్థి కనీసం 10 వేల మెజార్టీతో గెలుస్తారని అంచనా వేశాయి. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ఉపఎన్నికలో ఓటర్లకు భారీగా డబ్బులు పంచాయని ఆరోపణలు వచ్చాయి. చివరి గంటలో చాలా మంది ఓటర్లు క్యూలైన్లులోకి వచ్చి చేరారు. అందుకే అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఈ ఓట్లు ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది.
ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ ఆధారంగా వివిధ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఈ సర్వేల్లో టీఆర్ఎస్ కే గెలుపు అవకాశం ఉందని తేల్చాయి. కానీ సాయంత్రం 5 గంటల తర్వాత భారీ స్థాయిలో యువత ఓట్లు వేశారు. ఈ ఓట్లు ప్రస్తుతం కీలకంగా మారాయి. అభ్యర్థుల గెలుపును నిర్ధారించే ఓటింగ్ ఈ సమయంలోనే జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి మునుగోడులో ఎగ్జిట్ పోల్ సర్వేలే నిజమవుతాయా? ఓటర్లు సంచలన తీర్పు ఇస్తారా? వేచి చూడాలి.