Sajjala Ramakrishna Reddy | మాట వింటే మారుస్తాం.. వినకుంటే వదిలేస్తాం.. సీఎం జగన్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలివి. వైసీపీలో అసంతృప్తి, ఎమ్మెల్యేల మార్పులు, బీసీలకు పెద్దపీటపై కీలక వ్యాఖ్యలు చేశారాయన.
Sajjala Ramakrishna Reddy | మాట వింటే మారుస్తాం.. వినకుంటే వదిలేస్తాం.. సీఎం జగన్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలివి. వైసీపీలో అసంతృప్తి, ఎమ్మెల్యేల మార్పులు, బీసీలకు పెద్దపీటపై కీలక వ్యాఖ్యలు చేశారాయన.
ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల యుద్ధభేరి మోగించింది.
మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పుపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులతో తానే స్వయంగా మాట్లాడుతూ, నచ్చజెప్తూ, బుజ్జగిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి.
ఇలాంటి ముఖ్యమైన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గ్రామస్థాయిలో వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అన్నారాయన. ఆ అసంతృప్తిని నియంత్రించేందుకు జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టినట్టు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేల నియోజకవర్గ మార్పులు అందులో భాగం అన్నారు సజ్జల. ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవాలంటే అభ్యర్థుల్ని మార్చక తప్పదని కుండబద్దలు కొట్టారు. మార్పులకు కారణాలను కూడా వివరించే ప్రయత్నం చేశారు సజ్జల. అవినీతి ఆరోపణలు, గ్రూప్ తగాదాలు, బలమైన ప్రత్యర్థులున్నచోట మార్పులు చేస్తున్నట్టు చెప్పారాయన.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందడంపై.. ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలిపారు. చంద్రబాబు హయాంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు హాయిగా ఉన్నారని.. ఇప్పుడు ప్రజలు హాయిగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం కూడా మార్పులకు కారణంగా వివరించారు సజ్జల. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు జగన్ వివరిస్తుంటే చాలామంది వింటున్నారని… వినని కొందరిని వదిలేయడమే అంటూ కుండబద్దలు కొట్టారు సజ్జల.
మరోవైపు, టీడీపీ, జనసేనపై విమర్శలు గుప్పించారు సజ్జల. చంద్రబాబు, పవన్ మాటల్లో నిలకడ లేదని, వాళ్లిద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. పవన్ మాటలు వింటుంటే.. చంద్రబాబుని సీఎంగా చేయాలనేలా ఉందని.. ఆయన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకోవాలంటూ సెటైర్ వేశారు.
ఎన్నికల కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు సజ్జల చెప్తున్నారు. సంక్రాంతి తర్వాత జగన్ జనంలోనే ఉంటారని స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల సర్దుబాట్లు ఎలా ఉన్నా.. ఎంపీ టికెట్లు ఎక్కువగా బీసీలకే ఇవ్వబోతున్నట్టు చెప్పారు.
.
.