Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న అర్ధరాత్రి 1.45 నిమిషాల నుంచి జనవరి 1 రాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలను భక్తుల కోసం తెరవనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాన్ని అత్యంత పుణ్యప్రదంగా, అదృష్టంగా భక్తులు భావిస్తారు.
గత నాలుగేళ్లుగా 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని తెరిచి ఉంచుతున్నారు. శ్రీరంగంలో ఏ విధంగా అయితే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని తెరుస్తారో.. అదే విధంగా ఇక్కడ కూడా పాటిస్తున్నారు. ప్రతిరోజు 75 వేల నుంచి 80 వేల మంది భక్తులకు దర్శనం కోసం వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఈనెల 22 నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా ఉచిత టోకన్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథోత్సవం, ద్వాదశి రోజు చక్రతీర్థం నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. అలానే వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తుల భద్రత కోసం 1500 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉచిత టోకెన్ కౌంటర్ల వద్ద క్యూలైన్లతో పాటు భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాలు కూడా అందజేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.