ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరు అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈనెల 21న విచారణకు హాజరుకావాలని సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే విపాసన ధ్యానం కోసం కేజ్రీవాల్ గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.
కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడం వెనుక అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెడిటేషన్ కార్యక్రమం నేపథ్యంలోనే ఆయన హాజరు కాలేకపోయారని ఆప్ నేతలు అంటున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 10 రోజుల పాటూ ఉంటుందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా చెప్పుకొచ్చారు. ఏటా విసాసన మెడిటేషన్ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొంటారని ఆయన తెలిపారు. గతంలో కూడా బెంగళూరు, జైపూర్ వంటి నగరాల్లో ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు సీఎం కేజ్రీవాల్ వెళ్లారని ఎంపీ గుర్తు చేశారు.
అయితే ఈ యోగా కార్యక్రమం ఈడీ నోటీసుల కంటే ముందుగానే నిర్ణయించినదని తెలిపారు. ఈడీ విచారణకు హాజరు కాకపోవడం వెనుక ఏవైనా చట్టపరమైన సమస్యలు తలెత్తితే న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామని ఎంపీ రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో గతంలో కూడా ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించలేదు.