బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్ విధించింది హైదరాబాద్ మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు. అతడిపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పల్లవి ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించారు. ప్రశాంత్తో పాటు అతడి సోదరుడు మహావీర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
బిగ్బాస్ -7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకున్న రోజు రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్పై కేసు నమోదు చేశారు. ఈక్రమంలోనే బుధవారం అతడి స్వగ్రామం కొలుగూరులో అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పీఎస్కు పోలీసులు తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపర్చారు.
బిగ్బాస్ ఫైనల్ రోజు ఆదివారం రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్.. స్టూడియోస్ నుంచి బయటకు రాగా.. అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అదే సమయంలో రన్నరప్గా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో కొందరు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. మరో పోటీదారు అశ్వినీ కారు అద్దాలను పగలగొట్టారు. పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్కుమార్ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు.ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు.
ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ను చేర్చారు. ఎ-2గా అతడి సోదరుడు మనోహర్ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. అయితే ఈ కేసులో ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్ ను, అంకిరావుపల్లి రాజును పోలీసులు అంతకుమందే అరెస్టు చేశారు.