సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు గాను.. మధ్యాహ్నం 12 గంటలకు హస్తినకు బయలుదేరతారు. CWC మీటింగ్ లో తర్వలో జరిగే లోక్సభ ఎన్నికలపై చర్చించనున్నారు. అలాగే 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్పై కూడా సమీక్షించనున్నారు.
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో తెలంగాణలో పొత్తులతో వెళ్లాలా లేదంటే ఒంటరిగా బరిలో దిగాలా అన్నదానిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరగనుంది. ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా ఉన్నందున పొత్తులతో వెళ్తే ఆ పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలి? లేదంటే మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే పోటీ చేయాలా అన్నదానిపై సమావేశం అనంతరం క్లారిటీ రానుంది. ఇక ఈ సమావేశంలో రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి పాల్గొంటారు.
మరోపక్క గురువారం జరగాల్సిన కలెక్టర్ల సమావేశం వాయిదాపడింది. భూ సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహలక్ష్మీతోపాటు పలు పథకాల అమలుపై కలెక్టర్ల సమీక్షలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంది ప్రభుత్వం. అయితే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగడం.. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ టూర్తో ఈ భేటీ వాయిదా పడినట్టు తెలుస్తోంది.