జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైఎస్ఆర్సీపీ ఓటమి ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన ‘యువగళం-నవశకం’ సభ ద్వారా టీడీపీ -జనసేన ఎన్నిక శంఖారావాన్ని పూరించాయి. పవన్, బాలకృష్ణ సభకు హాజరై కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు రాష్ట్ర నలుమూలల నుంచి తెదేపా, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో పాదయాత్రలు చేయడం కొత్తకాదు. నేను కూడా పాదయాత్ర, బస్సు యాత్ర చేశా. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మొదటిసారి ఎన్టీఆర్ గారు చైతన్య యాత్ర చేశారు. అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పాదయాత్రలు చూశా. కానీ, ఎప్పుడూ పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవన్నారు. మొదటి సారిగా నియంతృత్వ, సైకో పాలనలోనే ఇలాంటి ఘటనలు చూశానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక పవిత్రమైన భావనతో పాదయాత్ర చేస్తున్నప్పుడు చేతనైతే సహకరించాలి.. లేదంటే ఇంట్లో కూర్చోవాలి. కానీ, పోలీసులను అడ్డం పెట్టుకుని ఇబ్బందులు పెట్టాడం సైకో నైజం అని బాబు మండిపడ్డారు. యువగళం వాలంటీర్లను జైలుకు పంపి జగన్ తప్పు చేశాడు, తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. యువగళం.. ప్రజాగర్జనకు నాంది పలికింది. ప్రజల్లో ఉండే బాధ, ఆక్రోశం, ఆగ్రహం యువగళం ఈ సభ రూపంలో చూయించారన్నారు.
వైఎస్సార్సీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోంది. మెడపై కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించు కుంటున్నా రంటే ఎంత బాధాకరమో ఆలోచించాలని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదన్నారు. ఒకప్పుడు విశాఖ ఆర్థిక రాజధాని.. ఇప్పుడు గంజాయి రాజధానిగా మార్చారన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగింది.. కబ్జాలు పెరిగాయి. మంచి చేస్తే ఆ ఫలితాలు అందరికీ వస్తాయి. కానీ చెడు చేస్తే దాని వల్ల అందరికీ నష్టం వస్తుంది. అదే ఈ రోజు జగన్రెడ్డి చేసే పని. ఒక్కఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సి వచ్చందన్నారు. విధ్వంస పాలనకు జగన్ నాంది పలికాడు, దాన్ని అంతం చేయడం మనందరి బాధ్యత అని జగన్ పై బాబు నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపి పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయని రుషికొండను బోడిగుండు చేసి.. సీఎం నివాసం కోసం రూ.500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారని బాబు ప్రశ్నించారు.
అమరావతిని సర్వనాశనం చేసి మూడుముక్కలాట ఆడారు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తి చేసేవాళ్లమన్నారు. అబద్ధాల పునాదులపై నిర్మించిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని దాన్ని అంతం చేసి ఆంధ్రప్రదేశ్కి విముక్తి కల్పించాలని ప్రజలను బాబు పిలుపునిచ్చారు.
టీడీపీ- జనసేన పొత్తుతో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి.. టీడీపీ- జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని బాబు ప్రకటించారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటా. అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ.2వేలు ఆర్థిక సాయం చేస్తాం. అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటాం. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తాం. భవిష్యత్లో ఏయే కార్యక్రమాలు చేయాలనేదానిపై అధ్యయనం చేస్తామన్నారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం ఖాయం. తెదేపా-జనసేన పొత్తు ప్రకటించినప్పుడే జగన్ పాలన నియంతృత్వం అంతం అయ్యిందని బాబు ఆరోపించారు.
మహిళలకు రక్షణ ఉండాలంటే ఏపీని వైఎస్ఆర్సీపీ నుంచి విముక్త రాష్ట్రంగా మార్చాలని చంద్రబాబు ఆకాంక్షించారు . వైఎస్ఆర్సీపీ ఒక రాజకీయ పార్టీకాదు. జగన్ రాజకీయాలకు అనర్హుడు. ఒక్క ఓటు ఆ పార్టీకి వేసినా..అది శాపంగా మారి మన భవిష్యత్తును, మన జీవితాలను నాశనం చేస్తుందన్నారు. జగన్ చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారన్నారు. టీడీపీ, జనసేనకు ఓటు వేస్తారనుకుంటే వారి పేర్లు జాబితా నుంచి తొలగిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని సంఘటలు ఏపీలో జరగుతుందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మీరు ఒక త్యాగం చేస్తే.. మేం వంద త్యాగాలు చేసి రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తాం. అభివృద్ధి చేయడానికి ముందుకొస్తాం. ఉద్యోగులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. అని చంద్రబాబు స్పష్టం చేశారు.