Nandamuri Balakrishna : వైసీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయవనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద నిర్విహంచిన సభలో పాల్గొన్న బాలయ్య.. లోకేశ్ పాదయాత్రలో ప్రజాగళం కదంతొక్కిందన్నారు. యువగళం యాత్రకు అనేక ఇబ్బందులు కల్గించినా పూర్తి చేశారని తెలిపారు.
ప్రజా సమస్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాడుతున్నారని బాలకృష్ణ అన్నారు. ఏపీలో చెత్త ప్రభుత్వం ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేయలేదని విమర్శించారు.రాజధానికి భూములిచ్చిన రైతుల ఉద్యమాన్ని అణచివేశారన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు.
ఏపీలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని బాలయ్య విమర్శించారు. భూములు, ఇసుక స్కాములతో వేలాది కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఏపీలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయన్నారు. వైసీపీ అక్రమాలు ఇలాగే కొనసాగితే వరల్డ్ మ్యాప్ లో ఏపీ కనిపించదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిప్డారు. సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర స్వర్గమా? తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.ఏపీ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు.