Toshiba : టొషిబా.. ఎంతో సుపరితమైన సంస్థ. టీవీలు, కంప్యూటర్లు, స్పీకర్ సిస్టమ్స్, బ్యాటరీలు వంటి పరికరాల తయారీలో తిరుగులేని బ్రాండ్. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆ కంపెనీ.. ఆర్థిక అక్రమాలు, అవకతవకల కారణంగా అధ:పాతాళానికి చేరింది. పబ్లిక్ సంస్థగా జపాన్లో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని 74 ఏళ్ల పాటు శాసించిన టొషీబా చివరకు డీలిస్టెడ్ కంపెనీగా మిగిలింది. తాజాగా టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజి నుంచి టొషిబా పేరును తొలగించడంతో దాని భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది.
అత్యంత ప్రసిద్ధి పొందిన ఈ సంస్థలో లుకలుకలు ఎనిమిదేళ్ల క్రితం తొలిసారిగా బయటపడ్డాయి. కంపెనీలోని పలు విభాగాల్లో చోటు చేసుకున్న ఆర్థిక, అకౌంటింగ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టాప్ మేనేజ్మెంట్లో కీలకంగా ఉన్న పలువురికి వాటిలో భాగస్వామ్యం ఉండటం గమనార్హం. ఏడేళ్ల పాటు లాభాలను సినిమాస్కోప్లో చూపించింది టొషిబా. 1.59 బిలియన్ల మేర లాభాలు గడిస్తున్నట్టు నమ్మబలికింది.
ఆ సంస్థ అకౌంటింగ్లో మరిన్ని లోపాలు 2020లో వెలుగుచూశాయి. వాటిపై ఆ మరుసటి ఏడాదే కూలంకష దర్యాప్తు జరిగింది. జపాన్ వాణిజ్యమంత్రిత్వశాఖతో కుమ్మక్కై.. తమ సంస్థను కీలకమైన సంపదగా టొషిబా చూపినట్టు అందులో వెల్లడైంది. దీనిపై ఆర్థిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
2016లో న్యూక్లియర్ పవర్ బిజినెస్లోకి దిగిన ఆ సంస్థ చేతులు కాల్చుకుంది. 6 బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది. దీని నుంచి బయటపడేందుకు మొబైల్ ఫోన్లు, మెడికల్ సిస్టమ్స్, వైట్ గూడ్స్ వంటి వ్యాపార విభాగాలను అమ్మేసింది. ఆపై చిప్ యూనిట్ అయిన టొషిబా చిప్ను సైతం విక్రయానికి పెట్టింది.
చివరకు ప్రైవేటీకరణే అంతిమ మార్గంగా కంపెనీ ఎంచుకుంది. ఈ ఏడాది మొదట్లో ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ జపాన్ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ 14 బిలియన్ డాలర్లకు టొషిబాను టోకోవర్ చేసింది. టొషిబాలో లక్ష మందికి పైగా ఉద్యోగులున్నారు.