Parliament: పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. ఇవాళ మరో ఇద్దరు ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఎం. ఆరిఫ్, సి .థామస్లు ఉన్నారు . తాజా సస్పెన్షన్తో ఎంపీల బహిష్కరణ సంఖ్య 143కు చేరింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటికి వరకు మొత్తం 143 మంది విపక్ష సభ్యులపై ఇరు సభల సభాపతులు సస్పెన్షన్ వేటు వేశారు.
పార్లమెంట్ చరిత్రలో ఇంత మంది సభ్యులపై ఒకే సమావేశాల్లో సస్పెన్షన్ వేటు పడటం ఇదే మొదటి సారి. మరోవైపు విపక్ష ఎంపీల సస్పెన్షన్పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడమేంటని కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్షాల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్కు నిరసనగా ఈ నెల 22వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని విపక్ష ఎంపీలు ప్రకటించారు.