Actress Hema Chaudhary : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల పాత్రలతో పాటు చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళకి కూడా మంచి గుర్తింపు వస్తుంది. కొన్ని సందర్భాలలో చేసినవి చిన్న పాత్రలో అయినా.. ఆ ఆర్టిస్టు టాలెంట్ కారణంగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తారు. అలా సౌత్ ఇండియాలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి హేమాచౌదరి. ఆమె ఇప్పటివరకు తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 180కు పైగా చిత్రాలలో నటించి.. తన నటనతో అందరిని మెప్పించారు.
ప్రస్తుతం ఆమె బ్రెయిన్ హేమరేజ్ కారణంగా.. బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటమే కాకుండా చికిత్సకు కూడా ఆమె స్పందించడం లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న హేమాచౌదరి ఆరోగ్యం పై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కన్నడలో రాజ్ కుమార్ ,విష్ణువర్ధన్, రవిచంద్రన్ ,అనంతనాగ్ శంకర్ నాగ్.. లాంటి ప్రముఖ నటులతో హేమాచౌదరి పలు చిత్రాలు చేశారు. ఇటు తెలుగులో కూడా చిరంజీవి ,మోహన్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలలో ఆమె నటించారు. ఆమె కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. తన సినీ కెరీర్లో.. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్ పాపులర్ స్టార్ లాంటి ఎన్నో అవార్డులను అందుకున్నారు.
1975 నుంచి పలు చిత్రాలలో హేమా చౌదరి నటించారు. సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు దుర్గ ప్రభా. విదేశాల నుంచి ఆమె కుమారుడు కూడా ఈరోజు ఇండియా చేరుకోబోతున్నాడు. హేమా చౌదరి ఎక్కువగా కన్నడ చిత్రాల్లో నటించారు. పుట్టింటికి రా చెల్లి ,గోరింటాకు లాంటి చిత్రాలను ఆమె నటన అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. కానీ ఆమె చికిత్సకు కాస్త స్పందించి కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.