Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఆర్థిక అరాచకం జరిగిందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆ కలలేవి నెవరేరలేదని విమర్శించారు.
శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్రావుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్బాబు. షార్ట్ డిస్కషన్కు 4 నిమిషాల ముందు 40 పేజీల బుక్లెట్ ఇచ్చి చదవకుండానే దానిపై చర్చ జరపడం సరికాదన్నారు హరీష్ రావు. ముందు రోజే డాక్యుమెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అందుకు ముందు జరిగిన తీరు కూడా ఇదేనన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గతంలోనూ డిస్కషన్ కు ముందు పేపర్లు ఇచ్చేవారన్నారు. తాము కూడా హరీష్ రావు మాదిరే ప్రస్తావించామని గుర్తు చేశారు. ఆయన చెప్పిన పాజిటివ్ పాయింట్ను తీసుకుంటామని తెలిపారు. శ్వేపత్రంపై చర్చకు అరగంట సమయమిస్తూ.. అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారు.
తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైరయ్యారు. ముఖ్యమంత్రిగారి పాత గురువు, శిష్యులు శ్వేతపత్రాన్ని వండివార్చారన్నారు. ఈ శ్వేపత్రాన్ని తయారు చేసిన వారిలో ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారని తెలిపారు. ప్రజలు, ప్రగతి కోణం ఎక్కడా కనిపించలేదని, గత ప్రభుత్వాలనే ఇబ్బంది పెట్టాలన్న ధోరణి మాత్రమే కనిపించిందని హరీష్ రావు అన్నారు. రాజకీయ ప్రత్యర్థుల దాడి, వాస్తవాల వక్రీకరణే ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఆరోగ్యంపై తక్కువగా ఖర్చుపెట్టామని శ్వేతపత్రంలో చెప్పింది అవాస్తవమని ఖండించారు హరీష్ రావు. కరోనా వల్ల కేంద్రం ఎక్కువగా అప్పులు తీసుకునేలా చేసిందని, కేంద్రప్రభుత్వం వివక్ష వల్ల భారం పడిందని అన్నారు. ఎంత భారం పడినా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదన్నారు. పన్నుల్లో వాటాను సెస్ ల రూపంలో ఎగ్గొట్టారన్నారు. కేంద్రం వల్లే ఏపీ విద్యుత్ బకాయిలు రాలేదన్నారు. సంబంధం లేని రుణాలన్నింటినీ చూపించి రూ.6 లక్షల కోట్ల అప్పుల్ని తేల్చారని, అప్పుల విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.