Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిరం త్వరలో ప్రారంభకానుంది. రాములోరి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 23 నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తారు. ఈ క్రమంలో రామ భక్తుల స్వామివారికి భారీ కానుకలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.
గుజరాత్ సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా రాములోరి కోసం వజ్రాల కంఠహారం తయారు చేయించారు. 5 వేల అమెరికన్ వజ్రాలతో ఈ కంఠహారం రూపొందించారు. రామాయణంలోని ముఖ్య పాత్రల చిత్రాలను కంఠహారంపై తీర్చిదిద్దారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ఈ హారాన్ని కానుకగా ఇస్తానని కౌశిక్ కకాడియా తెలిపారు.
ఈ కంఠహారం తయారీ కోసం 5 వేల అమెరికన్ వజ్రాలతోపాటు 2 కిలోల వెండిని ఉపయోగించారు. హారం తయారీ కోసం 40 మంది కళాకారులు 35 రోజులపాటు శ్రమించారు. కంఠహారంపై అయోధ్య రామమందిర నమూనాను కూడా పొందుపరిచారు.