తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత స్పీకర్ గడ్డం ప్రసాద్.. సీపీఐ ఫ్లోర్ లీడర్ గా కూనంనేని సాంబశివరావు పేరును, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ పేరును ప్రకటించారు. అనంతరం.. తెలంగాణ ఆర్థికపరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి స్వల్పకాలిక చర్చ ప్రారంభించింది. శ్వేతపత్రంపై ప్రతి సభ్యుడు తమ సూచనలివ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.
ఎన్నో ఆశలతో తెలంగాణ తెచ్చుకుంటే.. ప్రజలు కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయన్నారు. రోజువారి ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, కోరికలు, కలలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, పవిత్రమైన శాసనసభలో వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఇకపై రాష్ట్రంలో సహేతుకమైన పాలనను అందించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో.. ప్రస్తుతం తెలంగాణ అప్పు రూ.6,71,757 కోట్లు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2014-2015 రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లు ఉండగా.. పదేళ్లలో సగటున 24.5 శాతం అప్పు పెరిగింది. 2023-24 అంచనాల ప్రకారం FRBM లోన్లు రూ.3,89,673 కోట్లు ఉండగా.. ప్రభుత్వం చెల్లించాల్సిన గ్యారెంటీ అప్పులు రూ.1,27,208 కోట్లు ఉంది. 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉంది.
కాగా.. 42 పేజీల పుస్తకాన్ని అరగంట ముందు ఇచ్చి.. శ్వేతపత్రంపై మాట్లాడమంటే ఎలా కుదురుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. శ్వేతపత్రంపై చర్చించేందుకు సమయం కావాలని హరీశ్ రావు, అక్బరుద్దీన్ ఓవైసీ, కూనంనేని సాంబశివరావు కోరారు. దీంతో తెలంగాణ అసెంబ్లీని స్పీకర్ అరగంట వాయిదా వేశారు.