IND VS SA 2nd ODI : సౌతాఫ్రికా పర్యటనలో టీమ్ ఇండియా మొదటి వన్డే గెలిచి నేపథ్యంలో ఆత్మవిశ్వాసంతో రెండో వన్డే బ్యాటింగ్ ప్రారంభించింది. కానీ పూర్తిగా 50 ఓవర్లు కూడా ఆడలేక 46.2 కే ఆలౌట్ అయ్యింది. అతి కష్టమ్మీద 211 పరుగులు చేయగలిగింది. 50 ఓవర్లు స్పల్ప లక్ష్యం కారణంగా బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా కేవలం 2 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. రేస్ లోకి వచ్చింది.
ఓపెనర్ టోనీ డిజోర్జి (119 నాటౌట్) సెంచరీ చేసి, ఒంటిచేత్తో జట్టుని నడిపించాడు. భారత్ నుంచి చూస్తే రింకూ సింగ్ బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసుకుని కాసేపు సందడి చేశాడు.
అయితే మొదటి వన్డేలో 116 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్ చేసిన బౌలర్లేనా వీరంతా అని అనుకున్నారు. అర్షదీప్ సింగ్ కి అతికష్టమ్మీద 1 వికెట్ దక్కింది. కులదీప్ తేలిపోయాడు. అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ ఎవరూ ప్రభావం చూపించలేదు.
పిచ్ టర్న్ అవడమే కారణమని అంటున్నారు. తిలక్ వర్మ మూడు ఓవర్లు బౌలింగ్ చేసినా ఫలితం దక్కలేదు. 42 ఓవర్ కి వచ్చేసరికి సౌతాఫ్రికా 8 పరుగులు చేయాలి. ఆ సమయంలో కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ కూడా బౌలింగ్ చేశాడు. మూడు బంతులు వేసేసరికి టోనీ ఒక బాల్ ని సిక్సర్ గా కొట్టి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.
రెండో వన్డేలో కూడా టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ మార్ క్రమ్ ఈసారి బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన టీమ్ ఇండియా యువ జట్టు త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. అయితే కొత్త బ్యాటర్ సాయి సుదర్శన్, కెప్టెన్ కేఎల్ రాహుల్ చెరో అర్థ సెంచరీ చేయడంతో ఆ మాత్రం 211 పరుగులైనా చేయగలిగింది.
ఆస్ట్రేలియా సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ ఆడిన రెండు వన్డేల్లో నిరాశపరిచాడు. రెండో వన్డేలో కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒక ఎండ్ లో సాయి సుదర్శన్ నిలిచాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన తిలక్ వర్మ (10) ఆకట్టుకోలేదు. తర్వాత వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (56) జాగ్రత్తగా డిఫెన్స్ ఆడుతూ సాయి సుదర్శన్ తో కలిసి ముందుకు తీసుకువెళ్లాడు.
ఇద్దరూ కుదురుకుంటున్నారనే సమయానికి 26.2 ఓవర్ల వద్ద సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. తర్వాత 35.4 ఓవర్ దగ్గర కెప్టెన్ రాహుల్ అవుట్ అయ్యాడు. అప్పుడు స్కోరు 5 వికెట్ల నష్టానికి 167 పరుగుల మీద ఉంది.
అర్షదీప్ సింగ్ (18) చివర్లో బ్యాట్ ఝులిపించడంతో 200 మార్క్ అయినా టీమ్ ఇండియా దాటింది. అక్షర్ పటేల్ (7), సంజూ శాంసన్ (12), కుల్దీప్ (1), ఆవేశ్ ఖాన్ (9), ముఖేష్ కుమార్ (4 నాటౌట్ ) …ఇది టీమ్ ఇండియా బ్యాటర్ల దుస్థితి అని అందరూ కామెంట్ చేస్తున్నారు.
మొత్తానికి టీమ్ ఇండియా ఓడిపోవడంతో 1-1 స్కోరుతో సిరీస్ సమానమైంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే 23న జరగనుంది. సౌతాఫ్రికా బౌలర్లలో నాండ్రే బర్గర్ 3, హేండ్రిక్స్ 2, కేశవ్ మహరాజ్ 2, విలియమ్స్, కెప్టెన్ మార్ క్రమ్ 4 ఓవర్లు వేసి1 వికెట్టు తీసుకున్నాడు.