Tamilnadu Floods: అక్కడ ఊరు.. ఏరు.. ఏకమైంది. ఏది రోడ్డో.. ఏది కాలువో.. అర్థం కాని పరిస్థితి. చుట్టూ నీళ్లు.. పాదం బయట కాదు కదా.. మంచం మీద నుంచి కింద పెట్టలేని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే తమిళనాడులోని నాలుగు జిల్లాల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. హెలికాప్టర్లు వస్తే కానీ ప్రజలకు తినడానికి తిండి లేని పరిస్థితి. తమ చుట్టు ఉన్న నీరే.. ప్రస్తుతం తమిళ ప్రజలను కన్నీరు పెట్టిస్తుందని చెప్పాలి.
వరద తీవ్రత పెరగడంతో సహాయక చర్యల్లో పాల్గోనేందుకు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగింది. దీంతో జలదిగ్బంధంలో చిక్కుకొని ఆకలితో విలవిలలాడుతున్న ప్రజలకు ఇప్పుడు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందజేస్తున్నారు. ముఖ్యంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకాశి జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో ప్రజలెవ్వరూ ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక భారీ వర్షాలు, వాటి ద్వారా వచ్చిన వరదల కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారని తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన దాదాపు 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి రెస్క్యూ టీమ్స్. వరదలో చిక్కుకున్న ఓ గర్భిణి, చిన్నారిని ఆర్మీ హెలికాప్టర్లో మధురైకి తరలించారు. ఆ చిన్నారి వయస్సు ఒకటిన్నర ఏళ్లని ఆర్మీ అధికారులు తెలిపారు. మరో నలుగురిని కూడా రక్షించారు.
తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయిన 500 మందిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. రైల్వే ట్రాక్లు కొట్టుకుపోవడంతో వీరంతా రైల్వే స్టేషన్లోనే చిక్కుకుపోయారు. వీరిని అక్కడి నుంచి తరలించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికి.. NDRF సిబ్బంది అక్కడికి చేరుకోలేకపోతున్నారు.
ఒక సంవత్సర కాలంలో కురవాల్సిన వాన.. ఒక్కరోజులోనే కురిసిందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు తమిళనాడు సీఎం స్టాలిన్. నష్టం నుంచి బయటపడేందుకు కేంద్రం అవసరైన నిధులను పంపాలని కోరారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక తక్షణ సాయం కోసం 20 వేల కోట్ల నిధులను విడుదల చేసింది తమిళనాడు సర్కార్. వరద ప్రభావిత జిల్లాల్లో ఒక్కో కుటుంబానికి 6 వేల ఆర్థిక సాయాన్ని అందించనుంది.
.
.