IPL 2024: 2024లో జరగనున్న ఐపీఎల్ 17వ సీజన్ లో బీసీసీఐ ఒక కొత్త రూల్ తీసుకువచ్చింది. ఇది బౌలర్లకు వరంగా మారనుంది. ఇంతవరకు ఓవర్ కి ఒక బౌన్సర్ మాత్రమే వేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఓవర్ కి రెండు బౌన్సర్లు వేసే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆట స్వరూపమే మారే అవకాశాలున్నట్టు సీనియర్లు చెబుతున్నారు. ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేశారు. అంతేకాదు అంతర్జాతీయ మ్యాచ్ లు వన్డే, టెస్ట్ ల్లో ఈ రూల్ ఆల్రడీ ఉంది. ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అమలు చేయనున్నారు.
సీనియర్లు చెప్పే మాటేమిటంటే.. బౌన్సర్లను ఆడటం బ్యాటర్లకు కొద్దిగా కష్టం అవుతుంది. కొంతమంది మాత్రమే వాటిని సిక్సర్లు కింద మారుస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో అవి క్యాచ్ లుగా మారే అవకాశాలున్నాయి. బ్యాట్ కి కనెక్ట్ అయితే పర్వాలేదు. లేదంటే మాత్రం ఎక్కడో దగ్గర దొరికేస్తారు. అందుకనే బౌన్సర్ల విషయంలో బ్యాటర్లు ఆచితూచి ఆడుతుంటారు.
అంతేకాదు బౌలర్లకి ఇది అదనపు బలం అవుతుందని కూడా అంటున్నారు. ముఖ్యంగా ప్రతీ జట్టు కూడా మొదట్లో వికెట్లు కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడుతూ వెళతారు. చివర డెత్ ఓవర్లలో ఈ బాల్, ఆ బాల్ అని చూడకుండా చాకిరేవు పెడతారు. కానీ ఇప్పుడా పరిస్థితి ఉండకపోవచ్చునని అంటున్నారు. అంతేకాదు ‘నో బాల్స్’ బాధ తగ్గుతుందని చెబుతున్నారు.
ఆరు బాల్స్ లో బౌలర్ ఏం చేస్తాడంటే రెండు బౌన్సర్లు కచ్చితంగా వేస్తాడు. మిగిలిన నాలుగింటిలో రెండు యార్కర్లు వేస్తారు. వాటిని సిక్సర్లు, ఫోర్లు గా మలచడం కొద్దిగా కష్టమే. ఎటొచ్చి ఎంత కొట్టినా ఆ రెండు బాల్స్ పైనే ప్రతాపం చూపించాలి. అవి కూడా స్లో బాల్స్ వేస్తే బ్యాటర్ ఆడటానికేమీ ఉండదని అంటున్నారు.
ఎప్పుడైతే డెత్ ఓవర్స్ లో రన్స్ తగ్గుతున్నాయో, ఆటోమేటిక్ గా ఆటమీద ప్రభావం పడుతుంది. దాంతో గెలుపు ఓటములపై ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. ఈ బౌన్సర్లతో పవర్ ప్లే ఆడే విధానంలో మార్పు వస్తుందంటున్నారు. మొత్తానికి జట్లన్నీ ఇప్పుడు ఆడే గేమ్ ప్లాన్ సమూలంగా మార్చుకోవాల్సి ఉంటుందని సీనియర్లు చెబుతున్నారు.
ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన తీసుకొచ్చిన బీసీసీఐ, ఇప్పుడీ బౌన్సర్ నిబంధనతో బ్యాట్-బాల్ మధ్య పోటీ సమానంగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు.