BRS Debts: బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేసిన అప్పులెన్నో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ‘పదేళ్ల BRS విధ్వంసం–ఆర్థిక అరాచకం’ పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. ఇందులో 1956–2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చులో.. తెలంగాణకు వచ్చిన వాటా, జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించడంతో పాటు.. 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులెన్నో బయటపెట్టబోతోంది. 2014 నుంచి 2023–24 బడ్జెట్ ప్రతిపాదనలతో కలిపి.. మొత్తం అంచనాలు, పెట్టిన ఖర్చు, చేసిన అప్పులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతోంది.
తెలంగాణ ఏర్పడే నాటికి 75 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే.. గత పదేళ్లలో అది పది రెట్లకు పైగా పెరిగి 7 లక్షల కోట్లు దాటిపోయి ఉంటుందని భావిస్తున్నారు. FRBM కింద తెచ్చిందే 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని.. వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిళ్లు, సంస్థలకు గ్యారంటీలు ఇచ్చి లక్షా 30 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని అంచనా వేస్తున్నారు. ఇక కార్పొరేషన్ల ద్వారా మరో లక్షా 10 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఖర్చు చేశారని భావిస్తున్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు దాటి పోతుందని, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలంటే మరో లక్ష కోట్ల రూపాయలకు పైగా అవసరమని అంచనా. మరో లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు తెస్తే తప్పు పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే పరిస్థితి లేదు.
గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలకు, ఖర్చుకు పొంతన లేదని.. ఏకంగా 20 శాతం తేడా ఉందని ప్రభుత్వం గుర్తించింది. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24 వరకు మొత్తం 14,87,834 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తే, ఖర్చు చేసింది 12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం వివరించబోతోంది.
ఇక తీసుకున్న అప్పులకు కట్టాల్సిన అసలు, వడ్డీ కూడా ఏటికేడు భారీగా పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు.. ఏడాదికి చెల్లించాల్సిన అసలు, వడ్డీయే 55 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ లెక్కల్ని కూడా అసెంబ్లీ సాక్షిగా వివరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.
.
.