Yuvagalam Sabha: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభకు సర్వం సిద్దమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లిలో ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకూ ఈ సభ కొనసాగనుంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నారా లోకేశ్లు దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ఒకే బహిరంగ వేదికపై కలిసి కనిపించనున్న క్రమంలో ఈ సభ కోసం టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్లెక్సీలు, స్వాగత తోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది. సభా ప్రాంగణంలో భారీగా పసుపు బెలూన్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం-విజయనగరం మధ్య భారీ కటౌట్లు, జెండాలతో పసుపు జాతరను తలపిస్తోంది. భోగాపురం నుంచి విశాఖపట్నం వరకు పసుపు జెండాలు, కటౌట్లతో ఆ మార్గమంతా పసుపుమయమైంది. విశాఖనగరంతో పాటు ఉత్తరాంధ్రలోని ప్రతి నియోజకవర్గంలోనూ భారీ స్థాయిలో హోర్డింగులు, కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుంటున్నారు. అలానే ఈ సభ కోసం టీడీపీ 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభా స్థలికి చేరుకుంటున్నారు. ఈ వేదికపై నుంచే ఇరు పార్టీల అధినేతలు ఎన్నికల శంఖారావాన్ని పూరించనుండటంతో.. రాష్ట్ర, జాతీయ మీడియా కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు విశాఖపట్నానికి చేరుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సభ విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సభకు 6 లక్షల మందికి పైగా వస్తారని టీడీపీ అంచనా వేస్తోంది. 200 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 600 మందికి పైగా ముఖ్య నాయకులు ఆసీనులయ్యేందుకు వీలుగా 156 అడుగుల వెడల్పు, 64 అడుగుల పొడవుతో భారీ సభా వేదికను నిర్మించారు. దూరంగా ఉన్నవారికి సైతం కనిపించేలా పెద్ద పెద్ద ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోకి వచ్చేవారంతా కూర్చునేందుకు వీలుగా కుర్చీలు సిద్ధం చేశారు.
అలానే సభ కోసం ఇప్పటికే ఐదు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది టీడీపీ. రాష్ట్ర నలుమూల నుండి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చే వాహనాలకు 2, విశాఖ వైపు నుండి వచ్చే వాహనాలకు 2 భారీ పార్కింగ్ లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు.
తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మొత్తంగా 16 కమిటీలు వేసుకుని, ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సభకు హాజరయ్యేవారికి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు దాదాపు రెండు వేల మంది వాలంటీర్లుగా సేవలందించనున్నారు. సభకు హాజరయ్యేవారికి బుధవారం మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా సభా వేదికపై తెదేపా, జనసేన పార్టీలకు చెందిన అత్యంత ముఖ్యమైన, ముఖ్యమైన నాయకులకు ప్రొటోకాల్ ప్రకారం స్థానాలు కేటాయించారు. చంద్రబాబు, పవన్, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ సహా టీడీపీ, జనసేన ముఖ్యనాయకులు వేదికపై అగ్రభాగాన ఆసీనులు కానున్నారు. వీరితో పాటు ఇతర ఆహ్వానితులు క్యూఆర్ కోడ్లతో కూడిన పాస్లు ఇచ్చారు. ఆ కోడ్ను స్కాన్ చేసి వారిని సంబంధిత గ్యాలరీల్లోకి అనుమతిస్తారు.