President Visit: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించనున్నారు. జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత, స్పిన్నింగ్ యూనిట్తో పాటు థీమ్ పెవిలియన్ను రాష్ట్రపతి సందర్శిస్తారు. చేనేత కార్మికులతో ఆమె సంభాషించనున్నారు. ఉదయం 11 గంటలకు భూదాన్ పోచంపల్లికి చేరుకోనున్న రాష్ట్రపతి.. చేనేత ఉత్పత్తులు, వీవింగ్, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు. సుమారు 500 మంది చేనేత కార్మికులతో నిర్వహించే సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. సంత్ కబీర్, పద్మశ్రీ జాతీయ అవార్డులు పొందిన వారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 16 మంది ఉండగా.. అందులో పదిమందిని ఎంపిక చేసి రాష్ట్రపతి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.
వీటితోపాటు తెలంగాణ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా డిస్ప్లే ఉండనుంది. తెలంగాణ చేనేత వస్త్రాలు గొల్లభామ, పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, నారాయణపేట, గద్వాల వస్ర్తాలు, పుట్టపాక తెలియా రుమాలును ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు వినోభా మందిరంలో ఏర్పాట్లు సీపీ సుధీర్బాబు
పరిశీలించారు. ముర్ము రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలీప్యాడ్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. హెలికాఫ్టర్తో ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పోలీసు బలగాలు సభా ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.