Ponnam Prabhakar: రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని బీఆర్ఎస్ నేతలు గ్రహించాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు . గతంలో బంగారు పాలన అందించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.. బంగారు పాలన అందిస్తే ప్రజావాణి కోసం ప్రజలు ఎందుకు బారులు తీరుతారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని అందులో సందేహించాల్సిన అవసరమేమి లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
కేంద్రపైనా మంత్రి పొన్నం విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని, ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ఎంపీ సిఫార్సుల వల్లే నిందితులకు పాస్లు వచ్చాయని ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
పార్లమెంట్ ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పొన్నం ప్రశ్నించారు. పార్లమెంట్ భద్రత అంశంపై తక్షణమే విచారణ జరపాలన్నారు. విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేసి పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.