INDIA: దేశంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల కూటమి ‘ఇండియా’ నేతలు ఢిల్లీలోని అశోక హోటల్లో మరోసారి భేటీ అయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, శరద్ పవార్, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.
రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో వచ్చే లోక్సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఉమ్మడిగా ప్రచారం చేయాలా..? పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వంటి అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చించారని తెలుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే.. ఇండియా కూటమి లక్ష్యమన్నారు ఖర్గే. ప్రస్తుతం కూటమి ఫోకస్ ఎన్నికలపైనే ఉందన్న ఖర్గే.. డిసెంబర్ 31న సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందన్నారు.
అయితే లోక్సభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుల కోసం చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ‘జాతీయ కూటమి కమిటీ’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ కన్వీనర్గా పార్టీ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ను నియమించింది.
రాజస్థాన్, ఛత్తీస్గఢ్ల మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, సీనియర్ నేత మోహన్ ప్రకాశ్లు ఈ కమిటీ ముఖ్య సభ్యులుగా ఉన్నారు. తక్షణమే ఈ కమిటీ పని ప్రారంభిస్తుందని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు ఏర్పరచుకునే విషయమై అన్ని అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.