Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో… ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. ఇక్కడ కూడా అదే సెంటిమెంట్ తో… గురువారం దేశీయ సూచీలు నష్టపోయాయి.
అమెరికాలో ఫెడరల్ రిజర్వ్… వడ్డీరేట్లను మరో 75 బేసిస్ పాయింట్లు పెంచింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేదాకా రేట్ల పెంపు కొనసాగుతుందని సంకేతాలిచ్చింది. దాంతో… అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఆ ఎఫెక్ట్ మన మార్కెట్లలోనూ కనిపించింది. ఉదయం 60,511 పాయింట్ల దగ్గర నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్… ఇంట్రాడేలో 60,994-60,485 పాయింట్ల మధ్య చలించింది. ఒక దశలో నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి వచ్చినా… తిరిగి అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో… నష్టాలు పరిమితమయ్యాయి. చివరికి సెన్సెక్ 70 పాయింట్లు నష్టపోయి… 60,836 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 18,053 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్-30 సూచీలో 13 షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ, టైటన్, భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభపడ్డగా… టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు నష్టపోయి… రూ.82.90 వద్ద నిలిచింది.