Eluru : ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్క వరం గ్రామానికి చెందిన చందమాల మంగాదేవి అనే మహిళకు స్థానిక యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ నెల 14న తన ఏటీఎం కార్డును భర్త అరుణ్ కుమార్ కు ఇచ్చి నగదు తీసుకురమ్మని చెప్పింది.
జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న ఓ ఏటీఎంకు వెళ్లి నగదు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడ ఉన్న ఓ అపరిచిత వ్యక్తిని సహాయం కోరాడు. అతను ఏటీఎం నుంచి రూ.5 వేలు తీసి ఇచ్చాడు. అరుణ్ కు ఆ వ్యక్తి వేరే ఏటీఎం కార్డు ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పలు దఫాలుగా మంగాదేవి ఖాతా నుంచి రూ.1.86 లక్షలు మాయమయ్యాయి.
ఈ విషయం తెలియని బాధిత కుటుంబం సోమవారం నగదు తీసుకునేందుకు సంబంధిత బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అధికారులు ఏటీఎం కార్డు మారిందని చెప్పారు. ఖాతాలో సొమ్ము మాయమైనట్లు గుర్తించడంతో అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.