Red Sea: ఎర్రసముద్రం భగ్గుమంది. హౌతీ తిరుగుబాటు దారులు.. రవాణా నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. సోమవారం స్వాన్ అట్లాంటిక్ అనే నౌకపై యెమెన్ లోని తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి ఒక డ్రోన్, యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
స్వాన్ అట్లాంటిక్ పై దాడి జరిగే సమయంలో మరో బల్క్ కార్గో షిప్ ఎంవి క్లారాకు అత్యంత సమీపంలో భారీ పేలుడు జరిగింది. కాగా.. ఈ రెండు దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు తమకు సమాచారం అందలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆ నౌకలకు ఇజ్రాయెల్ తో సంబంధం ఉన్న కారణంగానే దాడి చేసినట్లు హౌతీ వర్గాలు వెల్లడించాయి. తమ ఫోన్ కాల్స్ కు నౌక సిబ్బంది స్పందించకపోవడంతో దాడులు చేసినట్లు సమాచారం.
అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్.. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంపై చర్చించేందుకు టెల్ అవీవ్ లో ఉన్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దీనిపై ఆస్టిన్ స్పందిస్తూ.. ఎర్రసముద్రంలో నౌకలపై జరుగుతున్న దాడుల గురించి చర్చించేందుకు పశ్చిమాసియాలోని రక్షణ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. నౌకల రక్షణ కోసం ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఎర్రసముద్రంలోని కార్యకలాపాలను పర్యవేక్షించే టాస్క్ ఫోర్స్ 153 నాయకత్వం వహిస్తుందని తెలిపారు.